బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా చెన్నై తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోర్ నమోదు చేసింది. బ్యాటర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ చెలరేగింది. ఆది నుంచే ఓపెనర్లు బౌండరీల మోత మొదలు పెట్టడంతో ఆర్సీబీకి అదిరే అరంభం లభించింది. ఓపెనర్లు జాకబ్ బెథెల్ (55 ; 33 బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్సులు) విరాట్ కోహ్లీ (62 ; 33 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సులు) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి 10 ఓవర్లలో 59 బంతుల్లో మొదటి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాంతో చెన్నై బౌలర్లను ఉతికారేశారు.
అయితే, జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ ఔటన తరువాత ఆర్సీబీ ఇన్నింగ్స్ నెమ్మదించింది. 12 ఓవర్లకు 121/2 ఉన్న స్కోర్.. 17.4 ఓవర్లకు 154/5 మాత్రమే నమోదైంది. దేవదత్ పడిక్కల్ (17), కెప్టెన్ రజత్ పటీదర్ (11), జితేష్ శర్మ (7) అంతగా రాణించలేదు.
ఆఖర్లో రొమారియో షెపర్డ్ (53 ; 14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు – నాటౌట్) ఊచకోతకోశాడు. చెన్నై బౌలర్లను సిక్సర్లు, ఫోర్లతో దంచేసిన షెపర్డ్.. మెరుపు వేగవంతో తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆర్సీబీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాప్ సెంచరీ నమోదు చేశాడు షెపర్డ్. షెపర్డ్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
చెన్నై బౌలర్లలో మథీష పతిరానా 3 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కర్రన్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో 214 పరుగుల భారీ టార్గెట్ తో సీఎస్కే ఛేజింగ్ కు దిగనుంది.