వికారాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రప్రభ) : ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశం హాలులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం తెలిపారు.
జిల్లాలో భూ భారతి రైతు అవగాహనా కార్యక్రమాలు ఉండడంతో ఈనెల 28న జరగాల్సిన ప్రజావాణిని వాయిదా వేశామన్నారు. తదుపరి మే నెల 5వ తేదీ నుంచి తిరిగి యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, కలెక్టరెట్ కార్యాలయానికి ప్రజలు ఎవ్వరు కూడా రాకూడదని కలెక్టర్ కోరారు.