Pitapuram | ఎన్నిక‌ల‌లో ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేరుస్తాం – ప‌వ‌న్ కల్యాణ్

పిఠాపురం – ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎపి డిప్యూటీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్ఘాటించారు. తన నియోజకవర్గం పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. పిఠాపురంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి స్థాయిని పెంచుతున్నామని, దీనివల్ల స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే నేటి ప‌ర్య‌ట‌న‌లో యు.కొత్తపల్లి టిటిడి కళ్యాణ మండపానికి, చేబ్రోలు శ్రీ సీతారామ స్వామి ఆలయ రథశాల, మండపం శంకుస్థాపన చేశారు ప‌వ‌న్. ఇక నియోజక వర్గంలోని మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, కుట్టు మిషన్లు అందించారు. అలాగే రైతుల‌కు వ్య‌వ‌సాయ యంత్ర ప‌రిక‌రాల‌ను అంద‌జేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *