Pink City | జైపూర్ అంబ‌ర్ కోట‌ను సంద‌ర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ..

జైపూర్ – భారత్‌‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం జేడి వాన్స్ సతీసమేతంగా ఇండియాకు వచ్చారు. ఈనెల 24 వరకు వాన్స్ పర్యటన కొనసాగనుంది. రెండో రోజైన నేడు జైపూర్‌ చేరుకున్న వాన్స్‌ కుటుంబం అక్కడ చారిత్రాత్మక కట్టడాలను సందర్శించారు. ముందుగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అంబర్‌ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వాన్స్ ఫ్యామిలీకి రాజస్థానీ సంప్రదాయ పద్దతిలో గజరాజులతో ఘన స్వాగతం పలికాయి. అలాగే హవా హల్, జంతర్ మంతర్ వంటి ప్రసిద్ధ స్మారక చిహ్నాలను సందర్శించారు.

కాగా.. ఈరోజు జైపూర్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు చిన్నారులు ఇవాన్, వివేక్, మిరాబెల్ విలాసవంతమైన రాంబాగ్ హోటల్‌లో బస చేస్తున్నారు. గతంలో హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అనేక మంది ప్రముఖులకు ఈ హోటల్‌ ఆతిథ్యం ఇచ్చింది.

ఇక ఈరోజు జైపూర్ పర్యటనలో భాగంగా రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఆర్‌ఐసీ)లో వాన్స్ ప్రసంగించనున్నారు. అమెరికా – భారత్ సంబంధాలపై మాట్లాడనున్నారు వాన్స్. ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, భారత అధికారులు, విద్యావేత్తలు తదితరులు హాజరుకానున్నారు. అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌ లాల్ శర్మ, గవర్నర్ హరిభౌ కిసన్ రావ్ బగాడేతో కూడా వాన్స్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన సందర్భంగా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక వాన్స్ పర్యటన నేపథ్యంలో అంబర్ ఫోర్ట్ ప్యాలెస్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేడు జైపూర్‌లో పర్యటన అనంతరం రేపు ) ఆగ్రాకు బయలుదేరి వెళ్లనుంది వాన్స్ కుటుంబం. ఆగ్రాలో పర్యటన అనంతరం తిరిగి జైపూర్‌కు రానున్నారు. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్‌ సందర్శన అనంతరం గురువారం జేడి వాన్స్ కుటుంబం తిరిగి అమెరికాకు బయలుదేరి వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *