న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్.. తాజాగా జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ సెక్టార్లలో డ్రోన్లతో దాడికి యత్నిస్తోంది. ఇక పాకిస్తాన్ డ్రోన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
యురి సెక్టార్లో మరోసారి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎల్వోసీ వెంబడి కాల్పులు, భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నట్లు సమాచారం. సరిహద్దుల వెంబడి సైరన్లు మోగించారు. జమ్మూ, అక్నూర్, జైసల్మేర్, అంబాలా, పంచుకులలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు.
రాజౌరీ, పూంఛ్, కుప్వారా, కతువా వంటి సున్నిత ప్రాంతాల్లో నైట్ విజన్ డివైజ్లతో పాటు స్పెషల్ ఫోర్స్ యూనిట్లను మోహరించారు. డ్రోన్ల కదలికలపై గగనతల నిఘాను పెంచారు. పాక్ ఉగ్ర గుంపులు భారత్లో చొరబాటుకు యత్నిస్తున్నాయన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
ఇంటిని నుంచి బయటకు రావొద్దు
జమ్ముతో పాటు చుట్టుపక్కల ప్రజలకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా విజ్ఞప్తి చేశారు. దయచేసి కొద్ది గంటల పాటు వీధుల్లోకి రావద్దు. మీ ఇంట్లోనే లేదా మీరు సురక్షితంగా ఉండగలిగే దగ్గర్లోనే ఉండండి. పుకార్లను విశ్వసించకండి, నిర్ధారణ లేని వార్తలను పంచుకోకండి అని చెప్పుకొచ్చారు