నంద్యాల బ్యూరో, జూన్ 10 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న నందికొట్కూరు (Nandikotkur) నియోజకవర్గ, మండలంలో ఉన్న కొణిదెల (Konidela) గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షల చెక్కును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి, సెక్షన్ సూపరింటెండెంట్ లకు జిల్లా కలెక్టర్ అందజేశారు.
ఈనిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిందిగా సూచించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నందికొట్కూరు శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కోరిన మేరకు, తమ ఇంటి పేరు కలిగిన కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. స్వయంగా తన వ్యక్తిగత నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. అలాగే గ్రామానికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని కలెక్టర్ తెలిపారు.
గ్రామస్తుల అభ్యర్థనల ప్రకారం, ప్రస్తుతం గ్రామంలో ఉన్న 20కెఎల్, 60 కెఎల్ ఓహెచ్ఆర్ ఓవర్ హెడ్ రిజర్వాయిర్ ట్యాంకులు చాలా పాతవిగా ఉండటం, వాటి నిర్వహణ కష్టంగా మారటం వల్ల నీటి సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు అందినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, సింగిల్ విలేజ్ స్కీమ్ (Single Village Scheme) క్రింద 90 కెఎల్ సామర్థ్యం గల ఓహెచ్ఆర్ ట్యాంకు ఏర్పాటు చేయడమే కాకుండా, గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించబడ్డాయని కలెక్టర్ వివరించారు. ఇలాంటి అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాలను కాపాడుతూ, ఎలాంటి ఆటంకాలు లేకుండా నాలుగు నెలలలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇదే సందర్భంగా ఆమె ఇటీవల ఉమ్మడి కర్నూలు (Kurnool) జిల్లా పూడిచెర్ల గ్రామంలో ఫారంపాండ్స్ నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత, నందికొట్కూరు ఎమ్మెల్యే వినతిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి తన సామాజిక బాధ్యతను చాటుతూ తన పుట్టిన ఇంటి పేరుతో ఉన్న గ్రామం అభివృద్ధికి ముందుకొచ్చారని, ఇది ఒక ప్రేరణాత్మక చర్యగా నిలిచే అవకాశముందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. డిఆర్ఓ రాము నాయక్, ఏఓ రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.