వెలగపూడి : పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భారత సాయుధ దళాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “పహల్గామ్ ఉగ్రదాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నేను గర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. వారి అసమాన ధైర్యం, కచ్చితత్వంతో, ఉక్కు సంకల్పంతో మన దేశం తనను తాను రక్షించుకుంటుందని వారు మళ్లీ నిరూపించారు” అని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు పూర్తి మద్దతును వ్యక్తం చేస్తూ, మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రశంసిస్తూ “ఈ రోజు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచం మన బలం, దృఢ సంకల్పాన్ని చూసింది. మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంది. మన సాయుధ దళాలకు మద్దతు ఇస్తుంది” అని ప్రకటించారు.
దశాబ్దాలుగా సహనం.. సహనం! .. పవన్ కల్యాణ్
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతంకి “ఆపరేషన్ సింధూర్” తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్ చేశారు.. మేము ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటున్నామంటూ పేర్కొన్నారు.