కొత్తగూడెం : దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ కగార్’ ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అడవుల్లో భద్రతా దళాలు ప్రతి ఇంచు జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కర్రెగుట్టలు, నారాయణపూర్ మాడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో సహా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కొత్తగూడెంలో మొత్తం 17మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. అందులో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, లొంగిపోయిన వారంతా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు వసతులు కల్పిస్తామని, వారి భవిష్యత్తుకు పూర్తి హామీ ఇస్తున్నామని ప్రకటించారు.