భంగపడ్డ అమెరికా అధ్యక్షుడు
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : వెనెజులా పార్లమెంట్ సభ్యురాలైన మరియా కొరినా మచాడోకు అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) లభించింది. 2025 సంవత్సరానికిగాను మచాడో ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ (Nobel Committee) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం మరియా కొరినా మచాడో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇదిలావుంటే హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతున్న జపాన్కు చెందిన ‘నిహాన్ హిడాంక్యో’ సంస్థకు గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెంచుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే భారత్-పాకిస్తాన్ యుద్ధం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, దీన్ని ఇండియా ఖండించడం జరిగింది. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రధాని మంత్రి కూడా ప్రతిపాదన చేసిన సంగతి విదితమే.