- రైతుల కోసం కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ ఆలోచన చేయలేదు
- రైతుబంధు పేరుతో బీఆర్ఎస్ అరకొర డబ్బులు వేసింది.. మిగిలినవన్నీ ఎత్తేసింది
- సెక్రటేరియట్ వద్ద సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రైతుల కోసం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఆలోచన చేయలేదని, రైతులను ప్రేమించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈరోజు (మంగళవారం) ఆయన సెక్రటేరియట్ వద్ద ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.
రైతులు సాగు చేసుకునేందుకు ఈ దేశంలోబహుళార్థక సార్ధక ప్రాజెక్టులు నిర్మించింది, రైతుల కోసం ఉచిత కరెంటు, రైతులు పండించే పంటకు మద్దతు ధర, బ్యాంకులు తప్పనిసరిగా రైతులకు రుణాలు ఇవ్వాలన్న నిబంధన పెట్టింది, వ్యవసాయంలో రెట్టింపు దిగుబడులు సాధించేందుకు హరిత విప్లవం వంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను ఈ దేశంలో చేపట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రేమించినంతగా మరే పార్టీ దగ్గరకు తీసుకోలేదని డిప్యూటీ సీఎం అన్నారు. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం అన్నారు.
కేవలం తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులు రూ.9 వేల కోట్లు రైతులు ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈరోజు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం అని హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వ క్యాబినెట్ సమిష్టి నిర్ణయంతో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు జమ చేశాం అని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లాలని, ఈ దేశంలో అద్భుతాలు సృష్టించాలని కలలుగన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సాక్షిగా రైతులు పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశాం దేశంలోని ఏ ప్రభుత్వము ఈ సాహసం ఇప్పటివరకు చేయలేదు అన్నారు. భూమిలేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం అని అన్నారు.
10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ పాలకులు రైతు బంధు పేరిట అరకొర నిధులు జమ చేసి వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీకే రుణాలు, డ్రిప్పు, స్ప్రింక్లర్ల, మద్దతు ధర, పండిన పంటకు బోనస్, పంట నష్ట పరిహారం వీటన్నిటిని నిలిపివేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేపట్టాం, రైతు భరోసా ఇస్తూ కూడా డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఇస్తున్నాం, పంట నష్టం జరిగితే పరిహారం అందిస్తున్నాం, రైతులకు ఆధునిక యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నాం రైతుల కోసం కావలసిన అన్ని సౌకర్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేయలేదు, చేయబోరు అన్నారు.
ఈనెల 16న అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది రోజుల్లో రైతు భరోసా కింద 9వేల కోట్లు జమ చేసి ఈనెల 24న పెద్ద ఎత్తున పండుగ చేస్తామని ప్రకటించారు అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నాం, రైతుల పండుగకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం కోరారు.