మెదక్, ఆంధ్రప్రభ : అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల కబంధహస్తాల నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను సమస్త విశ్వానికి శాంతిని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఈ రోజు మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని వారి నివాసంలో మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నీలం మధు ముదిరాజ్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ గాంధీ ప్రపంచానికే శాంతి సందేశం ప్రబోధించారని మధు ముదిరాజ్ అన్నారు. భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం అందించడం కోసం అహింసా పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు. గాంధీజీ ఎంచుకున్న శాంతి అహింస మార్గం భారతీయులకే కాదు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. అలాంటి మహోన్నత బాపూజీ మార్గం నుంచి నేటి యువత స్ఫూర్తి పొంది ఆయన బాటలో పయనించాలని కోరారు.

