నిజామాబాద్ ప్రతినిధి, మే 29(ఆంధ్రప్రభ) : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్, నేటి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులు ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యాలయాల శాశ్వత, తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు.
నిజామాబాద్ జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 1063 లో, తాత్కాలిక వసతి కోసం నాగారం శివారులోని ప్రభుత్వ డైట్ కళాశాల ఎంపిక చేయబడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి వివాదాలు లేని కలిగోట శివారులోని 30ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శాశ్వత, తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కాగా నవోదయ విద్యాసంస్థ మంజూరు చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవడంతో పాటు , తాత్కాలిక భవన మరమ్మత్తుల కోసం తన ఎంపీ నిధుల ద్వారా రూ.20లక్షలు మంజూరు చేసినందుకు జిల్లా ప్రజలు ఎంపీ అర్వింద్ కు ధన్యవాదాలు తెలిపారు.