వ‌ర్షంతో ఇక్క‌ట్లు

  • అద‌నంగా 5 కి.లో.మీ !!

హైదరాబాద్‌ నగరంలో కురిసిన భారీ వర్షాలకు అంబర్‌పేట్‌ వద్ద మూసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రోజురోజుకూ వరద ప్రవాహం పెరగడం వల్ల బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు.

అంబర్‌పేట్‌ నుంచి దిల్‌సుఖ్​నగర్ వెళ్లే వాహనదారులను దారి మళ్లించారు. మలక్‌పేట నుండి ముసారాంబాగ్ వంతెన మీదుగా అంబర్‌పేట పరిసర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులను కూడా దారి మళ్లించారు.

స్థానికులు ఆవేదన:

మూసారంబాగ్ వంతెనపై వరద నీరు ప్రవహించిన ప్రతిసారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైలెవల్ వంతెన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన పనులు మొదలు పెట్టి దాదాపు రెండేళ్లయినా కేవలం 20 శాతమే పూర్తవడం గమనార్హం.

మూసీ నదిపై ముఖ్యమైన ప్రాంతాల్లో 15 వంతెనల నిర్మాణానికి ప్రణాళిక జరగ్గా, కేవలం రెండుచోట్లే పనులు మొదలయ్యాయి. వాటిలో ఓ చోట పనులు అర్ధాంతరంగా నిలిచిపోగా, మిగిలిన ఒక్క పనిని కూడా జీహెచ్‌ఎంసీ సకాలంలో పూర్తి చేయలేక నానా అవస్థలు పడుతోంది.

పనులు నత్తనడకన సాగుతుండడంతో, అంబర్‌పేట్ – మలక్‌పేట్ మధ్య ప్రయాణించే వాహనదారులు చిన్న చినుకు పడినా కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనదారులు అదనంగా 5 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.

Leave a Reply