- జిల్లాలో రెచ్చిపోతున్న మట్టిమాఫియా
- ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు
- పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
వనపర్తి ప్రతినిధి, మార్చి11(ఆంధ్రప్రభ) : మట్టిమాఫియా రెచ్చిపోతోంది. కళ్లు మూసి తెరిచేలోపు గుట్టలకు.. గుట్టలను మాయం చేస్తోంది. అక్రమార్కులు అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి మట్టి వ్యాపారం సాగిస్తున్నారు. గుట్టల నుంచి మొరం తవ్వి వెంచర్లలో వేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహారిస్తున్నారు. గుట్టల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతుండటంతో నిన్న చూసిన గుట్ట నేటికి పంటచేనులా మారుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతి లేకుండానే…
భూమి చదునుకు మొరం తరలించాలంటే గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అనుమతులు తీసుకోకుండా ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వుకొని తరలిస్తున్నారు. వనపర్తి శివారులోని శ్రీనివాసపురం, మెట్టుపల్లి, నాగవరం, రాజానగరం శివారు, పెద్ద మందడి మండలం జగత్ పల్లి శివారు గుట్టల నుంచి మట్టిని తరలిస్తున్నారు. నాయకుల అండదండలతో ట్రాక్టర్ యజమానులు మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు ట్రాక్టర్ యజమానులు రూ.800లు విక్రయిస్తున్నారు. ఆయా గుట్టల వద్ద ఒక్కో ట్రాక్టర్ రోజుకు 10ట్రిప్పుల చొప్పున 20 ట్రాక్టర్లు 200ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. మొరం త్రవ్వే వద్ద ఇద్దరు, ముగ్గురు కాపలాగా ఉంటారు. అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినా వెంటనే వారు అక్రమార్కులకు ఫోన్ చేసి సమాచారం చేరవేస్తున్నారు.
మూడు పువ్వులు.. ఆరు కాయలుగా మట్టి వ్యాపారం..
మట్టి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతుండడంతో ఆ వ్యాపారం వైపు ఇటీవల చాలా మంది మక్కువ చూపుతున్నారు. అయితే పగటివేళ మట్టి కావాల్సిన వారి నుంచి ఆర్డర్లు తెచ్చుకోవటం.. అర్ధరాత్రి సమయాల్లో ప్రొక్లెయిన్లు పెట్టి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో వనపర్తికి అతిచేరువలో ఉన్న గ్రామాల్లోని గుట్టలు మాయమవుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అధికారుల మామూళ్ల మత్తు రూ.లక్షల మట్టి తరలుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. అనుమతులు తీసుకుంటే ఏం లాభం.. అర్ధరాత్రి దండుకుంటే చాలు అన్నచందంగా మట్టిమాఫియా రెచ్చిపోతోందని పలువురు అంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా రూ.లక్షల విలువైన మట్టిని తరలిస్తున్నారు.

వాల్టా చట్టానికి తూట్లు..
ప్రభుత్వ గుట్టల్లో చిన్న పుల్లను కదిలించినా చట్ట ప్రకారం తప్పవుతుంది. కానీ ప్రస్తుతం ఈ చట్టం కేవలం చట్టుబండగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టలు మాయం చేసే క్రమంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. అటవీశాఖ చట్టప్రకారం దీనిని పెద్ద నేరంగా భావిస్తారు. కానీ వనపర్తి శివారులోని ఎన్నో గుట్టలు రాత్రికి రాత్రి మాయం అవుతున్నా, చెట్లు నేలకొరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం.. రమేష్ రెడ్డి, తహసీల్దార్, వనపర్తి
అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. తహసీల్దార్ కార్యాలయo సిబ్బంది కొరత కారణంగా వాటిపై పెట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయoతో అక్రమ మట్టిని తరలింపును కట్టడి చేస్తాం.