- ఎడమ కాలికి బుల్లెట్ గాయం
- రహస్యంగా చికిత్స అందిస్తున్న పోలీసులు
ఏటూరునాగారం, మే 30 (ఆంధ్రప్రభ) : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, తెలంగాణ మిలిటరీ చీఫ్ బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ మొదటి అంచె రక్షణ దళంలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టు మడకం చిట్టి అలియాస్ కీడో పోలీసులకు బుల్లెట్ గాయాలతో పట్టుబడింది. మావోయిస్టు సభ్యురాలు చిట్టికి ఎడమకాలిలో బుల్లెట్ తగలడంతో వెంకటాపురం మండలం కొంగాల అటవీ ప్రాంతంలో చెట్టు వద్ద సేద తీరుతుండగా, కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది.
చిట్టి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్ ఘడ్ ప్రాంతం బీజాపూర్ జిల్లా దామోదర గ్రామానికి చెందిన మడకం మాయ అడిమి దంపతుల కుమార్తె చిట్టి అలియాస్ కీడో. మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై 2022లో పార్టీలో చేరింది. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో పార్టీ మావోయిస్టు నేత దామోదర్ రక్షణ దళంలోని మొదటి అంచె భద్రతా సభ్యురాలుగా నియమించబడింది. ఈ క్రమంలో ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుట్టలో ఈనెల 8న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిట్టి ఎడమ కాడికి బుల్లెట్ గాయం తగిలి పోలీసులకు పట్టుబడగా, అదుపులోకి తీసుకుని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాయబంధం గొత్తికోయగూడెంలో రహస్యంగా ఉంచి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
బడే చొక్కారావు అలియాస్ దామోదర్ రక్షణ దళంలో కీలక సభ్యురాలుగా చిట్టికి మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉన్నందున, పోలీసులు రహస్యంగా చిట్టికి చికిత్స అందించి ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఆమె నుండి పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరించడమే పోలీసుల లక్ష్యంగా తెలుస్తోంది.