Mamunur | ఎయిర్ పోర్టు తెచ్చింది తామంటే.. తామే నంటూ కాంగ్రెస్, బీజేపీ ఘర్షణ

బిజెపి – కాంగ్రెస్ ల‌డాయి
మామునూరు క్రెడిట్ మాదేనంటున్న ఇరు పార్టీలు
ఎయిర్ పోర్ట్ వ‌ద్ద నేడు భారీగా చేరుకున్న కార్య‌కర్త‌లు
నినాదాల‌తో హోరెత్తించిన హ‌స్తం, క‌మ‌లం నేత‌లు
అటు మోడీ, ఇటు రేవంత్ చిత్ర ప‌టాల‌కు పాలాభికం ప్ర‌య‌త్నాలు
దీంతో ఇరుపార్టీ నేత‌ల మ‌ద్య వాగ్వాదం , తోపులాట‌
పోలీసుల రంగ ప్ర‌వేశంతో స‌ద్దుమ‌ణిగిన గొడ‌వ

వ‌రంగ‌ల్ – మామునూరు ఎయిర్‌పోర్ట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య క్రెడిట్ వార్ కు తెర‌లేచింది. మా వల్లే ఎయిర్‌పోర్టు వచ్చిందంటే.. కాదు తమ వల్లే అంటూ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు ఘర్షణకు దిగాయి. మామునూరు ఎయిర్‌పోర్టు క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీపడుతున్నాయి. ఈ క్రమంలో మామునూరు ఎయిర్‌పోర్టుకు రెండు పార్టీల శ్రేణులు చేరుకున్నాయి. ప్రధాని మోడీ చొరవ వల్లే మామునూరు ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని బీజేపీ నేతలు సంబరాలు చేసుకునేందుకు మామునూరు ఎయిర్‌పోర్టు స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేప‌థ్యంలోనే నేటి ఉదయం ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు భారీగా వచ్చారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. ఈ స‌మ‌యంలోనే బీజేపీ నేతలు ప్రధాని మోడీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. అటు.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదే చోట పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకునేందుకు య‌త్నించారు. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వారిని శాంతింప‌జేశారు.. అక్క‌డి నుంచి వారంద‌ర్ని పంపివేశారు.

కాగా.. మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే.. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా, తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి మామునూరు ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారనుంది. కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పనులను వేగంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *