ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో, శ్రీశైలం, నాగార్జునసాగర్ కు భారీగా వద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఉండగా 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ కు ఇన్ ఫ్లో 1,74,533 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణమ పోటెత్తుండడంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరద నాగార్జునసాగర్(Nagarjuna Sagar)కు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్కు స్వల్పంగానే..
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)కు స్వల్పంగానే వరద వస్తోంది. బుధవారం ఉదయం 12 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1080 అడుగులు (44.937 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా ప్రాజెక్టుకు పెద్దగా వరద రాలేదు. ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో భారీవర్షాలు కురియక పోవడంతో గోదావరి బోసిపోయింది.
మేడిగడ్డకు భారీ వరద
ఎగువ గోదావరి వెలవెలబోతుండగా, దిగువ గోదావరి మాత్రం కొత్త నీటితో ఉరకలెత్తుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కు భారీగా వరద(Heavy Flood) వస్తోంది. అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్కు లక్ష క్యూసెక్కులపైగా ఇన్ఫ్లో వచ్చింది. అయితే బ్యారేజ్ కుంగిపోవడంతో గేట్లన్నంటినీ తెరిచి ఉంచారు. మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

