రేయింబవళ్లూ శ్రమించిన అందరికీ వందనాలు

రేయింబవళ్లూ శ్రమించిన అందరికీ వందనాలు
- వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు
( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ): కోటబొమ్మాళి (Kotabommali) మండలం, టెక్కలి నియోజకవర్గం : కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా రేయింబవళ్లూ శ్రమించిన యంత్రాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి పదిరోజులుగా ఏర్పాట్లలో తలమునకలయిన అధికార, అనధికార వర్గాల కృషి అలానే పారిశుద్ధ్య సిబ్బంది అంకిత భావం మరువలేనిదని అన్నారు.
సచివాలయం (Secretariat) లో ఉంటూ తాను నిర్దేశం ఇచ్చిన ప్రతి మాటనూ పాటించి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అమ్మవారి భక్తులకు ఏ ఆటంకం రాకుండా దివ్య దర్శనం అయ్యేందుకు ఎక్కడా అసౌకర్యానికి తావు లేకుండా కృషి చేసిన పోలీసు సిబ్బంది సేవలు స్మరణీయం అని కొనియాడారు. ఆర్టీసీ సిబ్బంది సేవలు, ఉత్సవాలలో వలంటీర్ల సేవలు ఎంతో బాగున్నాయని, వందేళ్ల ఉత్సవానికి వన్నె తెచ్చే విధంగా కళా బృందాలు ఎంతగానో కృషి చేశాయని, శోభాయాత్రతో ఉత్తరాంధ్రుల సంస్కృతిని చాటి చెప్పారన్నారు.
ఉత్సవాలను మరిచిపోలేని విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ తన తరఫున అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఉత్సవాలకు వన్నె తెచ్చారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి అంతా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. కోటబొమ్మాళి అమ్మవారి దీవెనలు జిల్లా ప్రజలపై ఉండాలని మరొక్కసారి ఆకాంక్షించారు.
