ఐపీఎల్ 2025 ఫైనల్స్కు చేరాలనే ఆశతో నేడు జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఈ కీలక పోరులో.. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై… గుజరాత్ బౌలర్లను ఉతికారేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది.
ఓపెనర్ల మెరుపు ఆట
ముంబై బ్యాటింగ్ను ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆరంభించాడు. 28 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన రోహిత్.. 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. ర్యాన్ రికెల్టన్కు బదులుగా జట్టులోకి వచ్చిన జానీ బెయిర్స్టో కూడా అదరగొట్టాడు. కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. ఈ జోడీ తొలి వికెట్కు 44 బంతుల్లోనే 84 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం అందించింది.
మధ్య ఓవర్లలోనూ దూకుడు..
వన్డౌన్గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. 20 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో కలిసి రెండో వికెట్కు 34 బంతుల్లో 59 పరుగులు జోడించాడు. అతని తర్వాత వచ్చిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తక్కువ బంతుల్లోనే మెరుపులు మెరిపించాడు. కేవలం 11 బంతుల్లో 3 సిక్సులతో 25 పరుగులు చేసిన తిలక్.. రోహిత్ శర్మతో జత కట్టి 3వ వికెట్ కు 22 బంతుల్లో 43 పరుగులు జోడించడంలో సహాయపడ్డాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్
ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా దుమ్మురేపాడు. కేవలం 9 బంతుల్లోనే 3 సిక్సులతో 22 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దాంతో ముంబై జట్టు భారీ స్కోరైన 228/5ని నమోదు చేయగలిగింది.
గుజరాత్ బౌలింగ్ విభాగంలో సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీయగా… ముహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే ముంబై దూకుడును గుజరాత్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేయలేకపోయారు.
గుజరాత్కి భారీ ఛాలెంజ్
ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ముందు 229 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పంజాబ్తో క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్టు ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. దీంతో ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకూ కీలకం కావడంతో… ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలే లక్ష్యంతో గుజరాత్-ముంబై జట్లు అమీతుమీ తలపడనున్నాయి.