నిజామాబాద్, మే 15 (ఆంధ్రప్రభ): ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురై సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ రూరల్ నియో జకవర్గంలోని మల్లారం గ్రామానికి చెందిన ఎం.సాయిలు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాలేదని గురువారం ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.
ఇందిరమ్మ ఇంటికి అర్హతలున్నాయని, ముందుగా ఇల్లు కోసం అతను బేస్మెంట్ వరకు కట్టుకోవడం జరిగింది. అధికారులు అనర్హతగా ప్రకటించడంతో మల్లారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఫోన్ లో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో మాట్లాడి ఎం.సాయిలు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో సెల్ టవర్ నుంచి దిగడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.