రెండో రోజూ పూర్తి ఆధిపత్యం..

  • రాహుల్, జురేల్, జడేజా సెంచరీలు

అహ్మదాబాద్ టెస్ట్ : అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆతిథ్య భార‌త్ ఆధిపత్యం చెలాయించింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజాలు ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై చెల‌రేగుతూ… అద్భుతమైన సెంచరీలు సాధించారు. దీంతో రోజు ముగిసే సమయానికి భారత్ 448/5 స్కోరుతో నిలిచి, వెస్టిండీస్‌పై 287 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

రెండో రోజు ఆట ప్రారంభంలో బ్యాటింగ్‌ను ప్రారంభించిన కేఎల్ రాహుల్ (100) – కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50) తమ భాగస్వామ్యాన్ని పటిష్టంగా కొనసాగించారు.

అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసి దూకుడుగా కనిపించిన గిల్, రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో అనూహ్యంగా వికెట్ కోల్పోయి 50 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది.

మరోవైపు, రాహుల్ మాత్రం 53 పరుగుల నుండి ఆరంభించి, ఏమాత్రం తడబడకుండా మరో 47 పరుగులు జోడించి తన అద్భుత శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో రాహుల్ స్థిరమైన ఆటతీరును ప్రదర్శించాడు. అయితే, సెంచరీ అనంతరం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయిన రాహుల్, జోమెల్ వారికన్ బౌలింగ్‌లో కవర్స్‌లో ఫీల్డర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తొలి టెస్టులో మెరుపు శతకం..

రాహుల్ ఔటైన‌ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన యువ వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురేల్ (125) తన తొలి టెస్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్లు–పేసర్లు ఎవరినీ లెక్కచేయకుండా చెలరేగి పోయాడు జురేల్. తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో దాదాపుగా వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి శతకం సాధించాడు.

జురేల్ తో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కలిసి ఆరో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి భారత్‌ను పటిష్టమైన స్థితికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

దురదృష్టవశాత్తు, జురేల్ శతకం తర్వాత ఖారీ పియర్ బౌలింగ్‌లో వెనుక నుంచి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 125 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు.

జడేజా తల్వార్ సెలబ్రేషన్…

ఒక చివరన ధ్రువ్ జురేల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన రవీంద్ర జడేజా (104 నాటౌట్) మరోసారి తన విలక్షణ శైలిలో అద్భుత సెంచరీ పూర్తి చేశాడు. జడేజా తన సెంచరీ అనంతరం తనదైన శైలిలో ‘తల్వార్ సెలబ్రేషన్’ చేసి అభిమానులను అలరించాడు. రోజు ఆట ముగిసే సమయానికి జడేజాకు మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (9, 13 బంతుల్లో)* తోడుగా క్రీజులో ఉన్నాడు.

రోజు మొత్తం భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ (2/90) రెండు వికెట్లు తీయగా, వారికన్ (1/102) , ఖారీ పియర్ (1/91) తలా ఒక వికెట్ పడగొట్టగలిగారు.

రెండో రోజు ముగిసే సమయానికి భారత్ ఆధిపత్య స్థితిలో నిలవగా, వెస్టిండీస్ జట్టు మూడో రోజు నుంచి పోరాడి మ్యాచ్‌లో తిరిగి నిలబడాలంటే చాలా కష్టతర పరిస్థితిలో ఉంది.

Leave a Reply