ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) 2025లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ (India-England) మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది. ఇప్పటికే ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉండటంతో… భారత్కు నాలుగో టెస్ట్ తప్పనిసరి గెలుపు మ్యాచ్గా మారింది.
లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో భారత్ కేవలం 22 పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో శుభ్మన్ గిల్ (Shubhman Gill) నేతృత్వంలోని జట్టు తప్పనిసరిగా ఈ మ్యాచ్లో విజయం సాధించాలనే సంకల్పంతో ఉంది. దాంతో సిరీస్ను 2-2తో సమం చేసి, చివరి మ్యాచ్ను నిర్ణయాత్మకంగా మార్చాలన్నది టీమిండియా లక్ష్యం.
జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఈ నాలుగో టెస్ట్ జరగనుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 3:00 గంటలకు జరగనుంది.
ఇక ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ ను ముందే ఖాయంచేసుకోవాలని చూస్తున్నది. మరోవైపు, సిరీస్ పై భారీ ఆశలతో టీమిండియా నాల్గవ టెస్ట్ మ్యాచ్ లోకి అడుగుపెడుతుంది. ఈ నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే, ఓవల్ లో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.
వేదిక చరిత్ర, పిచ్ పరిస్థితులు..
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారత్ కు మంచి రికార్డులు లేవు. ఇప్పటివరకు ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారత్ 9 టెస్టులు ఆడగా.. ఒక్కటి కూడా గెలవలేదు. 4 సార్లు ఓడి, 5 మ్యాచ్లు డ్రా అయ్యాయి. భారత్ ఇక్కడ చివరిసారిగా 2014లో టెస్టు ఆడి, పెద్ద పరాజయం ఎదుర్కుంది.
ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ సాంప్రదాయకంగా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మేఘావృత వాతావరణంలో బౌన్స్, కదలికను అందిస్తుంది.
ఇక్కడ పిచ్ సాధారణంగా పేసర్లకు సౌకర్యంగా ఉంటుంది. వాతావరణం మేఘావృతంగా ఉంటే బౌన్స్, స్వింగ్ ఎక్కువగా లభిస్తుంది. అయితే, రోజులు గడుస్తూ పిచ్ నెమ్మదీ అవుతుంది కాబట్టి స్పిన్నర్లు కూడా చివర్లో ప్రభావం చూపిస్తారు.
జట్టు పరిస్థితి:
భారత జట్టుకు కొన్ని గాయాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా సిరీస్కి దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ నెట్స్ లో గాయం కారణంగా 4వ టెస్టుకు దూరమయ్యాడు. పేసర్ ఆకాష్ దీప్ కూడా గాయం కారణంగా దూరమయ్యే అవకాశం ఉంది.
భారత్ జట్టు అంచనా : శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్-కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కంబోజ్.
ఇంగ్లాండ్ జట్టులో షోయబ్ బషీర్ వేలి గాయం కారణంగా సిరీస్కి దూరమవ్వగా, లియామ్ డాసన్ కొత్తగా జట్టులోకి వచ్చాడు. అతని స్పిన్ బౌలింగ్ చివరి రోజుల్లో ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.
ప్రసారం, లైవ్ స్ట్రీమింగ్:
భారత్లో ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. జియోసినిమా, జియోహాట్స్టార్ యాప్ల్లోనూ వీక్షించవచ్చు. యూకేలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ప్రసారం చేస్తుంది.