హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి 12 ఏళ్ల తరువాత ట్రోఫీని ముద్దాడింది. దాంతో దేశ వ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ప్రేమికులు సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో పలుచోట్ల క్రికెట్ ప్రేమికులు రోడ్ల మీదకు వచ్చి బాణసంచా కాల్చారు. జై భారత్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫైనల్లో భారత్ విజయం అనంతరం సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీచార్జీ చేశారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి.
దేశంపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటే అడ్డుకుని, తమపై లాఠీఛార్జ్ చేయడం సరికాదని క్రికెట్ ప్రేమికులు అసహనం వ్యక్తం చేశారు. అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనాలు వచ్చి బాణసంచా పేల్చడంతో వాహనదారులు ఇబ్బండి పడతారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, క్రికెట్ అభిమానులపై లాఠీ ఛార్జీ చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పపట్టారు.. పోలీసులు సంయమనంతో వ్యవహరించాల్సిందని అయన అభిప్రాయపడ్డారు.