ఆయన.. రైతుకు రోల్ మోడల్..

ఆయన.. రైతుకు రోల్ మోడల్..
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో – మన దేశంలో వేల సంవత్సరాల కిందట నుంచే ప్రకృతి పద్ధతుల్లో పండించే అనేక దేశీయ వరి రకాలు ఉన్నాయి. కాలక్రమేణా ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడులు, రసాయన ఆధారిత వ్యవసాయం కారణంగా అంతరించిపోయాయి. కానీ ఇప్పటికీ కొందరు అభ్యుదయ రైతులు ఆ పాత వంగడాలను తిరిగి పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు. అలాంటి ఒక అరుదైన దేశీయ వరి వంగడమైన తులసి బాసోను చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అభ్యుదయ రైతు చందూల్ కుమార్ రెడ్డి పండించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ రకం ఒకసారి పంట వేస్తే.. మూడుసార్లు కోతకు వస్తుంది. బాస్మతి లాంటి సుగంధ పరిమళం వెదజల్లుతుంది. చిట్టి ముత్యాలు లాగా పొట్టి రకం. ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తుంది. మొదటిసారి ఎకరాకు 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. దేవాలయాలలో అన్న ప్రసాదానికి అనువైన రకం. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుంది.
తులసి బాసో అనే ఈ అరుదైన దేశీయ వరి రకం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినది. అక్కడ శతాబ్దాలుగా ఈ వంగడాన్ని పండిస్తున్నారు. ఇది సువాసనభరితమైన సెంటెడ్ రైస్, బాస్మతి లాంటి పరిమళం కలిగి ఉంటుంది. చిట్టిముత్యాల లాంటి గింజలతో ఉండే ఈ బియ్యం తినడానికి చాలా మధురంగా, తేలికగా ఉంటుంది. ఎంత తిన్నా భుప్తాయాసం రాదు. ముఖ్యంగా చిన్న పిల్లల ఎదుగుదలకు, శారీరక శక్తివృద్ధికి కావలసిన ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది పోషక విలువలతో కూడిన ఔషధ బియ్యంగా ప్రసిద్ధి చెందుతోంది. తులసి బాసో రకం విశేషం ఏమిటంటే.. ఒకసారి నాట్లు వేస్తే మూడుసార్లు పంట తీసుకోవచ్చును. మొదటి పంటకు 135 రోజులు, రెండవ పంటకు 60–70 రోజులు, మూడవ పంటకు 45–50 రోజులలో దిగుబడి వస్తుంది.
సాధారణంగా రెండో మూడో పంటల్లో గింజ పరిమాణం తగ్గుతుంది కానీ.. ఈ రకంలో అలా కాదు. పైగా పంటలు పండుతున్నకొద్దీ సువాసన మరింత పెరుగుతుంది. రైతులు విత్తనంగా ఉపయోగించవలసింది మాత్రం మొదటి కోతలోని గింజలు మాత్రమే. ఎందుకంటే.. రెండవ, మూడవ పంటల విత్తనాలతో దిగుబడి తగ్గిపోతుంది. మొదటి పంటకు ఎకరాకు 15–18 క్వింటాళ్లు, రెండవ పంటకు 6–8 క్వింటాళ్లు, మూడవ పంటకు 5–6 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఇంత అద్భుతమైన పంట లభించడం వల్ల రైతులకు మంచి లాభం దక్కుతుంది. తులసి బాసో వరి రకం ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో పండించడానికి అనువైనది. ఇది గాలులకు, తుఫానులకు కూడా తట్టుకోగలదు. పంట ఒరగదు. అందుకే.. ఇది ప్రకృతి వ్యవసాయం చేసే వారికి, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసేవారికి సరైన ఎంపికగా మారింది.
పరిమళభరితమైన దేవాలయ బియ్యం..
ఈ రకంతో వండిన అన్నం, పాయసం వంటివి దేవాలయ ప్రసాదాలకు అత్యంత అనువైనవి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండటం వల్ల దీన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ బియ్యంగా పరిగణిస్తారు. అంటే ఇది మధుమేహం ఉన్న వారికి కూడా ఆరోగ్యకరమైన ఆహారం. దేశంలోని వివిధ విత్తన మేళాలలో పాల్గొంటూ, అరుదైన దేశీయ వంగడాలను సేకరిస్తున్న పలమనేరుకు చెందిన చందూల్ కుమార్ రెడ్డి తులసి బాసో విత్తనాలను కొందరు పశ్చిమ బెంగాల్ రైతుల వద్ద నుండి సేకరించారు. ప్రస్తుతం ఆయన ఒక ఎకరా మేరకు ఈ పంటను విజయవంతంగా సాగు చేస్తున్నారు. ఈ రకం దిగుబడిని పరిశీలించి, విత్తనాల ద్వారా ఇతర రైతులకు అందజేయాలన్న సంకల్పంతో ఉన్నారు. మన దేశంలో ఎన్నో సంప్రదాయ వంగడాలు ఉన్నాయి. వాటిలో తులసి బాసో ఒక అద్భుతమైన వరి రకం. మన ఆరోగ్యానికి, మన భూమికి, మన భవిష్యత్తుకి ఇది ఎంతో మేలు చేస్తుందని చందూల్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

అభినందిద్దాం.. ఆదర్శంగా తీసుకుందాం..
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఇలాంటి పాత వంగడాలను తిరిగి పండిస్తే, దేశీయ విత్తన సంపదను కాపాడినట్లవుతుంది. జెనెటిక్ మోడిఫైడ్ పంటలతో వచ్చే ప్రమాదాల నుండి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఇది మార్గదర్శకం అవుతుంది. తులసి బాసో పాత విత్తనంలో పుట్టిన కొత్త ఆశ! దేశీయ వంగడాలను పునరుద్ధరిస్తున్న చందూల్ కుమార్ రెడ్డిలాంటి రైతులు మన వ్యవసాయ వారసత్వానికి జీవం పోస్తున్నారు. అలాంటి రైతులను మనం అభినందిద్దాం.. ఆదర్శంగా తీసుకుందాం..
