కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన బీజేపీ ఎంపీలు.
కంచె గచ్చిబౌలి భూములను రక్షించాలని వినతి
భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
మంత్రి ధర్మేంద్ర ప్రదాన్కు పరిస్థితి వివరించిన బిజెపి ఎంపీలు
న్యూ ఢిల్లీ – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల పంచాయితి తాజాగా డిల్లీకి చేరింది. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా ఆర్త నాదాలో అల్లారుతోందన్నారు. ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని.. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ భేటీలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ కూడా ఉన్నారు.