భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. గతేడాది జూన్లో సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు వీడ్కోలు పలికాడు… అయితే, టీమిండియా ఫుట్బాల్ కింగ్.. తాజాగా తన రిటైర్మెంట్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘సునీల్ ఛెత్రి జట్టులోకి తిరిగొచ్చాడు. భారత ఫుట్బాల్ దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి మార్చిలో ఫిఫా మ్యాచ్లు ఆడేందుకు సిద్దమవుతున్నాడు’అని ఏఐఎఫ్ఎఫ్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది.
40 ఏళ్ల సునీల్ ఛెత్రి గతేడాది జూన్లో అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ కెరీర్కు వీడ్కోలు పలికినా.. ఇండియన్ సూపర్ లీగ్లో కొనసాగుతున్నాడు. కాగా, 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లోకి అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రీ.. 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ నమోదు చేశాడు.
ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో,(217 మ్యాచ్ల్లో 135 గోల్స్) లియోనల్ మెస్సీ (191 మ్యాచ్ల్లో 112 గోల్స్) మాత్రమే ఛెత్రీ కంటే ముందున్నారు. భారత్.. ఈ నెల బంగ్లాదేశ్, మాల్దీవులతో ఆడనుంది. ఈ మ్యాచ్లతోనే సునీల్ ఛెత్రి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.