మున్సిపాలిటీ అయినా మారని తిప్పలు..!

మున్సిపాలిటీ అయినా మారని తిప్పలు..!

-డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నకాలనీ
-ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం
-వాట్సాప్‌లో విన్నపాలు…
-ప్రజలే మోరి శుభ్రం చేసుకునే పరిస్థితి
-ఇది 16వ వార్డు శ్రీరామ కాలనీ వాసుల ఆవేదన

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీగా మారినప్ప టికీ.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదని 16వ వార్డు శ్రీరామ కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ఆశలతో ఉన్న ప్రజలకు రోజువారీ సమస్యలే భారంగా మారాయని వాపోతున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ (మోరి) సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మోరి శుభ్రపరిచే పనులు చేపట్టలేదని వారు చెబుతున్నారు. దీంతో కాలుష్యం పెరిగి, దుర్వా సన భరించలేని స్థాయికి చేరిందని, ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

-చెత్త సేకరణలో నిర్లక్ష్యం:
గల్లీల్లో చెత్త సేకరణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ప్రజలు మండిపడుతున్నారు. వారానికి ఒక్కసారైనా చెత్త బండి రాకపోవడంతో చెత్త పేరుకుపోయి పరిసరాలు అసహ్యంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల స్థానికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మున్సిపాలిటీ స్టేషన్ ఘన్‌పూర్ వాట్సాప్ గ్రూప్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలించి డ్రైనేజీ శుభ్రత, చెత్త సేకరణ పై వెంటనే చర్యలు తీసుకోవాలని 16వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

-చివరికి ప్రజలే ముందుకు:
అధికారుల నిర్లక్ష్యంతో చివరికి ఓ ఇంటి యజమాని స్వయంగా తన ఇంటి ముందు ఉన్న మోరిని శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీగా మారినా సమస్యలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయని విమర్శిస్తున్నారు.

Leave a Reply