ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 20 (ఆడియోతో…)

భారతం, శాంతి పర్వంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

న సంపదాం సమాహారే విపదాం విని వర్తనే
సమర్ధ: దృశ్యతే కశ్చిత్‌ తం వినా పురుషోత్తమమ్‌

కావాల్సిన సంపదలను సమకూర్చుటలోను, ఆపదలను తొలగించుటలోను శ్రీమన్నారాయణుడు తప్ప మరెవ్వరూ సమర్థులు కారు.

సామాన్యంగా ప్రతీ ప్రాణి తనకు సుఖము కలగాలని ఆయా కర్మలను ఆచరిస్తుంది. దు:ఖాలు తొలగి సుఖాలు కలగాలని మానవుడు చేసే పనుల వలన విపరీత ఫలితాలు కలుగుతున్నాయి. అనగా సుఖాలు తొలగి, దు:ఖాలు కలుగుతున్నాయి. కావల్సిన దానిని తన ప్రయత్నంతోనే సంపాదించుకోగలనని అవసరం లేని వాటిని
తొలగించుకోగలననే దురభిమానం వి పరీత ఫలితాన్నిస్తుంది.

పండు తినాలని కత్తతితో కోస్తే మన కర్మఫలం పండు తినడం అయితే చేయి పండును కోస్తుంది అదే వేలు తెగడం అయితే కత్తి వేలును కోస్తుంది. పొరపాటుగా జరిగింది అనుకుంటే, ‘పాటు’- కష్టం, ‘పొర’ – ఛాయ లేదా నీడ అంటే మనకు తెలియకుండానే కష్టం నీడ అని ఒప్పుకున్నాము. మరో రీతిలో పరధ్యానం వల్ల జరిగిందని అనుకుంటాం అనగా మరొక దానిపై దృష్టి పెట్టడం కానీ వాస్తవంగా పరధ్యానం అనగా పరుని ధ్యానం అనగా పరమాత్మ ధ్యానం. పరమాత్మ ఆలోచన ఆయన సంకల్పం కర్మఫలాన్ని ఇస్తుంది, మనం తెలియక అన్నా ఇది పరమాత్మ చేయించిన పని అని తెలుస్తోంది కనుక సంపదలు ఇవ్వాలన్నా, ఆపదులు తొలగించాలన్నా ఒక్క శ్రీమన్నారయణుడే శరణం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *