ఢిల్లీ : ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు. పలువురు విమాన ప్రయాణికులు ఎక్స్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. దీని కారణంగా కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈక్రమంలోనే బలమైన ఈదురుగాలులు వీయడంతో దాదాపు 15 విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు.
‘ముంబయికి వెళ్లేందుకు దిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు’ అని ఒక ప్రయాణికుడు వార్తా సంస్థతో తెలిపారు. ఇక, పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఆవేదనను వ్యక్తంచేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.