న్యూఢిల్లీ : రాయలసీమ ప్రజల చిరకాల కోరిక అయిన హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యూఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, “రాయలసీమ ప్రజలకు న్యాయపరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అత్యవసరం. ప్రస్తుతం న్యాయ సహాయం కోసం 500 కిలోమీటర్లకు పైగా విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమ ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. యువగళం పాదయాత్రలో వేలాది మంది ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోరుతూ విన్నవించారు” అని వివరించారు.
రాష్ట్రంలోని కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతూ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్కు విజ్ఞప్తి చేసినట్లు లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ‘యువగళం’ పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.
హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి కీలకం అని, న్యాయం అందరికీ సమానంగా అందాలంటే భౌగోళికంగా సమతుల్యత అవసరమని నారా లోకేష్ పేర్కొన్నారు.