మూడు రోజులుగా అంత్యక్రియలు చేయని వైనం

మూడు రోజులుగా అంత్యక్రియలు చేయని వైనం
- సూర్యపేట జిల్లాలో దారుణం
- తల్లి మృతదేహం వద్ద కూతుళ్ల పంచాయితీ
సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఆస్తి తగాదా తెగేదాకా తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని.. కూతుళ్లు తెగేసి చెప్పారు. దీంతో మూడు రోజులుగా ఆ మాతృమూర్తి మృతదేహం నట్టింట్లోనే ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా(Suryapet District) ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆత్మకూర్(District)(ఎస్) మండల కేంద్రానికి చెందిన పొదిల నరసమ్మకు ఇద్దరు కూతుళ్లు వెంకటమ్మ, కళమ్మ(Venkatamma, Kalamma) సంతానం. భర్త మృతి చెందడంతో నరసమ్మ(Narasamma) అన్నితానై కూతుళ్లను సాకి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. పెద్దకూతురు వెంకటరమణ పెళ్లయిన వెంటనే ఇల్లరికం తీసుకురాగా చిన్న కూతురు కళమ్మకు కట్నం కింద రెండు ఎకరాల భూమి ఇచ్చి వివాహం జరిపించింది.
ఆస్తి అంత పెద్ద కూతురుకు పోతుందని చిన్న కూతురు పంచాయితీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేసుకుంది. ఇరువురికి పెద్దమనుషుల సమక్షంలో బాగాల పంపిణీ చేసి అగ్రిమెంట్ చేశారు. పెద్ద కూతురు తల్లిని చనిపోయే వరకు సాకాలని తీర్మానం చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన నరసమ్మను చిన్న కూతురు కలమ్మ ఆసుపత్రి(Hospital)కి తీసుకెళ్లి అట్నుంచి తన ఇంటి దగ్గరే ఉంచుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన నరసమ్మ మూడు రోజుల క్రితం మృతిచెందింది. మృతదేహాన్నిఅదే రోజు ఆత్మకూరు మండల కేంద్రంలోని పెద్ద కూతురు వెంకటమ్మ ఇంటికి తీసుకువచ్చింది.
ఈ క్రమంలో తల్లి నరసమ్మ దగ్గర ఉన్న బంగారం వెండి తోపాటు సుమారు 25 లక్షల వరకు నగదు ఏమైందని చిన్న కూతురు కలమ్మను వెంకటమ్మ ప్రశ్నించగా అంత్యక్రియల కార్యక్రమానికి ఉండకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. అంతేకాకుండా వెళ్తూ వెళ్తూ ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్లో(S Police Station) తమపై దాడి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో మూడు రోజులుగా నరసమ్మ అంత్యక్రియలు జరగలేదు.
