DEAD | వ్యాపారి మృతి

DEAD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన కోఠి కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన బట్టల వ్యాపారి రిన్షద్ మృతి చెందినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఇవాళ ఉదయం నగరంలో పట్టపగలే జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను ఆమె మీడియాకు వివరించారు.

డీసీపీ శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం… నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారి రిన్షద్, రూ.6 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. ఉదయం 6:50 నుంచి 7 గంటల మధ్యలో, రిన్షద్ డబ్బు డిపాజిట్ చేస్తుండగా స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపారన్నారు. ఈ కాల్పులతో రిన్షద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారని, ఆసుపత్రికి తరలించగా… అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారని ఆమె తెలిపారు.

దాడి అనంతరం నిందితులు, రిన్షద్ వద్ద ఉన్న రూ.6 లక్షల నగదుతో పాటు అతని బైక్‌ను కూడా తీసుకుని పరారయ్యారని వివరించారు.ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ తెలిపారు. ఘటనా స్థలంలో రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు చాదర్‌ఘాట్ వైపు వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు.

Leave a Reply