- టోర్నీ నుంచి సీఎస్కే ఔట్
- టాప్ 2లో పంజాబ్
చెన్నై : చెపాక్ వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆతిథ్య సీఎస్కేని పంజాబ్ జట్టు చిదిమేసింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ సీజన్లో సీఎస్కే జట్టు తమ హోం గ్రౌండ్ లో ఓడిపోవడం ఇది ఐదవసారి. ఈ ఓటమితో, చెన్నై జట్టు ఈ టోర్నమెంట్ నుండి నిష్క్రమించగా.. పంజాబ్ జట్టు 13 పాయింట్లతో రెండవ స్థానానికి దూసుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు.. సీఎస్కేని 190 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రేయస్ సేన ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే, పంజాబ్ జట్టు ఆఖర్లో స్వల్ప తడబాటుకు గురైంది. కానీ ఆరంభం అద్భుంగా ఉండటంతో అప్పటికే కావాల్సిన పరుగులు సాధించిన పంజాబ్.. చెన్నైపై ఈజీ విక్టరీ నమోదు చేసింది.
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (23 ; 15 బంతుల్లో 5ఫోర్లు) పరుగులకు ఔటవ్వగా… మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (54 ; 36 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సులు), కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (72 ; 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) అర్ధశతకాలతో విధ్వంసం సృష్టించారు. ఇక శశాంక్ సింగ్ (23; 12 1ఫోర్, 2 సిక్సులు) రాణించగా.. జోష్ ఇంగ్లిస్ (6), మార్కో జాన్సన్ (4) నాటౌట్గా నిలిచారు.
చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, మతిష పతిరానా రెండేసి వికెట్లు తీయగా.. జడేజ, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అంతకముందు చెన్నై బ్యాటింగ్ సమయంలో పంజాబ్ బౌలర్లు రాణించారు. ముఖ్యంగా 19వ ఓవర్లో యుజ్వేంద్ర చాహల్ (4/32) నాలుగు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. ఇక అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ రెండేసి వికెట్లు తీయగా… అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

సీఎస్కే బ్యాటర్లలో సామ్ కర్రన్ ( 47 బంతుల్లో 88), డెవాల్డ్ బ్రెవిస్ (26 బంతుల్లో 32).. మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
