Crowd of Devotees | కాణిపాకంలో పకడ్బందీ ఏర్పాట్లు

Crowd of Devotees | కాణిపాకంలో పకడ్బందీ ఏర్పాట్లు
Crowd of Devotees | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumith Kumar) తెలిపారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల సంవత్సరాది నేపథ్యంలో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఆలయ ఆవరణలో ప్రత్యేక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళి మోహన్, ఆలయ ఈవో పెంచాల కిశోర్, ఆలయ ఛైర్మన్ మణి నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Crowd of Devotees | జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

ప్రతి సంవత్సరం జనవరి 1న లక్షలాది భక్తులు కాణిపాకం వినాయకుడిని దర్శించుకుంటారని, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి, వరుస సెలవుల కారణంగా సుమారు 60 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీకి అనుగుణంగా ఆలయం లోపల, బయట క్యూ లైన్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సులు అధికంగా నడపాలని, నిరంతర విద్యుత్ సరఫరా, దీపాల అలంకరణ, అత్యవసర అవసరాల కోసం జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు, అగ్నిమాపక శాఖ ద్వారా ఫైర్ ఇంజిన్ను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ మూడు రోజులు అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
Crowd of Devotees | జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ..

చిత్తూరు డీఎస్పీ (DSP) ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వాహనాల పార్కింగ్కు తగిన స్థలాలు కేటాయించామని వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తామని, సుమారు 200 మందికి పైగా పోలీస్ సిబ్బందిని విధుల్లోకి దింపుతున్నట్లు తెలిపారు.
Crowd of Devotees | పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళి మోహన్ మాట్లాడుతూ..
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గత ఏడాది సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, ఈసారి మరింత మంది వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రద్దీ ఎక్కువైనా భక్తులకు (Devotees) సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనవరి 1న ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనం రద్దు కాగా, ఉదయం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం కల్పిస్తామని, రాత్రి 11 గంటల వరకు సామాన్య భక్తులు నిరాటంకంగా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ సమన్వయ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, చిత్తూరు ఆర్డీఓ, జిల్లా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
