TG | బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వ హత్య!
ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. రియల్టర్ వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య… అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
ఒకప్పుడు బిల్డర్ అంటే లోన్లు ఇస్తామని బ్యాంకులు వెంటపడేవి… కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన ఇప్పుడు బిల్డర్ అంటే బ్యాంకులు లోన్లు ఇవ్వమంటూ మొహం చాటేస్తున్నాయి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని ఆయన అన్నారు. ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక, బ్యాంకుల్లో అప్పులు రాక దిక్కు తోచని స్థితిలో ఆత్మ స్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నడని.. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని చూస్తే బాధేస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో ముఖ్యమంత్రి సమీక్షించుకుకోవాలన్నారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రియల్ ఎస్టేట్ రంగం, బిల్డర్ల సమస్యలపైన లేవనెత్తుతామని.. బాధితుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజలు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవద్ధని హరీష్ రావు కోరారు.