హైడ్రాకు అభినందనలు..
హైదరాబాద్ సిటీ బ్యూరో, (ఆంధ్రప్రభ)
వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్ పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రి నగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినా ఆ కాలనీల ప్రతినిధులు మైత్రీవనం వద్ద ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు. 5 సెంటీమీటర్ల వర్షం పడితే అతలాకుతలం అయిన మా కాలనీలకు వరద ముప్పు తప్పించారంటూ హైడ్రాను కీర్తించారు. అమీర్ పేట మైత్రీవనం వద్ద నడుములోతు నీళ్లుతో నిలబడి ఇబ్బందులు పడేవాళ్ళం అని.. హైడ్రా వచ్చింది.. అక్కడి భూగర్భ పైపు లైన్లలో పూడికను పూర్తిగా తొలగించింది. దీంతో ఇటీవల 15 సెంటీమీటర్ల వర్షం పడిన వరద నీరు నిలవలేదు అని చెబుతూ హైడ్రా పని తీరుకు అభినందనలు తెలిపారు.
ఎక్కడికక్కడ నాళాల్లో పూడిక పేరుకుపోవడంతో అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ రోడ్ల మీద పారేదని.. నేడు హైడ్రా చర్యలతో ఆ సమస్య పరిష్కారం అయ్యిందని అక్కడి నివాసితులు పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలో హైడ్రా అనేక విజయాలు సాధించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఇక్కడకు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కార బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అనేక సార్లు పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇక్కడి కష్టం తెలుసు. హైడ్రాతోనే ఈ సమస్య పరిష్కారం అయ్యింది. హైడ్రాలాంటి వ్యవస్థను తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

