కలెక్టర్ బిజీబిజీ

కలెక్టర్ బిజీబిజీ
- దసరా ఏర్పాట్లపై నజర్
- హోల్డింగ్ ప్రాంతాల తనిఖీ
- సిబ్బందికి దిశానిర్ధేశం
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా దసరా మహోత్సవాల(DasaraMahotsavam) కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (Lakshmisha) తెలిపారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే దసరా మహోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశమున్నందున అందుకు తగ్గట్లు చేసిన ఏర్పాట్లలో ఎక్కడా లోపాలు లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూలా నక్షత్రం రోజున అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
హోల్డింగ్ పాయింట్ల (holding points) తో పాటు కేశ ఖండనశాల, స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, పార్కింగ్, భద్రత.. ఇలా ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా పరిశీలించారు. గిరి ప్రదర్శనతో ముడిపడిన అంశాలనూ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా మార్గాలను పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technology) ఉపయోగించి నిరంతర పర్యవేక్షణతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తక్షణం పరిష్కరించేందుకు, కమ్యూనికేషన్ పరంగా వేగాన్ని అందిపుచ్చుకునేందుకు, సమన్వయ సాధనకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం, నగర పర్యటన మధురానుభూతులను మిగిల్చేలా ఈసారి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
