ఆదిలాబాద్లో తోపులాట
సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.. ఖానాపూర్, ఆదిలాబాద్ లో తోపులాట… ఉద్రిక్తత..
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : కాళేశ్వరం (Kaleshwaram) పై సీబీఐ విచారణ సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) ఆరోపించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ కొమరం భీమ్ చౌక్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అక్కడి నుండి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాయి.
దీంతో పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ (Adilabad) లో బీఆర్ఎస్ ఆఫీసు గేటు ఎదుట రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాళ్ల బూట్లతో తొక్కుతూ కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, అజయ్, సాజిదోద్దిన్, రాజన్న, జంగిలి ప్రశాంత్, దాసరి రమేష్, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ (Khanapur) నియోజవర్గంలో ఇన్ చార్జి బుక్య నాయక్ ఆధ్వర్యంలో బాదన్ కుర్తి గోదావరి వంతెనపై రాస్తారోకో చేపట్టారు. కడెం, పెంబి, దస్తురాబాద్, ఖానాపూర్ మండలాల నుండి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి చేతగాని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పై నిందలు మోపి రాజకీయంగా తమ పార్టీని దెబ్బతీసేందుకే కుట్రపన్నారని ఆరోపించారు. కాగా బోత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపుమేరకు బోత్, నేరడిగొండ, ఇచ్చోడ, తలమడుగు, బజార్హత్నూర్ మండలాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.