మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం(Police Martyrs’ Memorial Day) నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొని పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులను పరామర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శింగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఆయా విభాగాలకు చెందిన ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పోలీసు సురక్ష రూపొందించిన “అమరులువారు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సీఎం ప్రసంగంలోని ముఖ్య అంశాలు
- “పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయరు. నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.
- పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము వంటిదే. పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తు, వీఐపీల రక్షణ.. ఇలా సవాలక్ష బాధ్యతలతో విరామం లేకుండా పని చేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు.
- మన ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మా ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేశాం.
- సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించాం.
- విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్లలోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం.
- తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలను, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు 2 కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
- ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. 3 రోజుల కింద నిజామాబాద్ లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ వేతనంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ సంక్షేమం నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం.
- ఆ బాధ్యతతోనే పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. అందులో భాగంగా పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించాం.