వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి, జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఏడాదిలో పదిహెను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ప్రత్యేకతను కల్పిస్తూ… ఏడాది పొడవునా ఉండే ఒకో ఏకాదశికి ఒకో పేరు పెట్టడం జరిగింది. వైశాఖ బహుళ ఏకాదశిని ‘అపర ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భద్రకాళి జయంతి’గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి… తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు, తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్టసంహారం చేసే భద్రకాళి అమ్మవారి ఉగ్రరూపాన్ని తలపించినా… భక్తులకు మాత్రం శాంతమూర్తే! ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఆ ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుగుతుంది. ఒడిషాలో జలకృత ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
చాలా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. ఈ రోజు ఉపవాసం ద్వారా విష్ణువు మాత్రమే కాక, లక్ష్మిదేవి కూడా అనుగ్రహించి, అన్ని బాధలు, అడ్డంకులను తొలగుస్తుందని భక్తుల విశ్వాసం. అపర ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా పాండు రాజు పెద్ద కుమారుడు ధర్మరాజుకు వివరించినట్లు బ్రహ్మాండ పురాణం చెపుతున్నది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి వారి పుణ్య కార్యాల వల్ల చాలా పేరు పొందుతారని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు.
అపర ఏకాదశి పాపపుణ్యాల చెట్లతో నిండిన పూర్తిగా పరిపక్వమైన అడవిని నరికివేసే గొడ్డలి, ఇది కట్టెలు కాల్చినట్లు పాపాలను ద#హంచే అడవి మంట లాంటిది.
కార్తీక సమయంలో పుష్కర క్షేత్రంలో ప్రతిరోజూ మూడుసార్లు స్నానం శివుడికి సేవ చేయడం, గయలో పూర్వీకులకు పితృ కర్మలు ఆచరించడం, బృహస్పతి సింహరాశి సంచార సమయంలో పవిత్ర గౌతమీ నదిలో స్నానం చేయడం, కేదారనాథ్ వద్ద శివుని దర్శనం, సూర్యుడు కుంభ రాశిని సంక్రమించి నపుడు బద్రీనాథ దర్శనం, కురుక్షేత్రంలో సూర్యగ్రహణం సమయంలో స్నానం చేయడం, మరియు ఆవులు, ఏనుగులు బంగారాన్ని దాన ధర్మంగా ఇవ్వడం…అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పై పుణ్యకార్యాలు చేయడం వల్ల కలిగే పుణ్యమంతా లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు పురాణాలు చెపుతున్నాయి.
అపర ఏకాదశి కఠోరమైన వ్రతాన్ని ఆచరించి, విష్ణుమూర్తిని భక్తితో పూజించడం ద్వారా పాపాలన్నీ తొలగి పోతాయి. అపర ఏకాదశి ఉపవాసం ఉంచడం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు. ఈ దినం విష్ణు సహస్రనామం పారాయణం, జపం, ఉపవాసం, జాగరణ, దానధర్మాలు చేయడం అత్యంత ప్రతిఫలదాయకంగా పరిగణించ బడుతాయి. విష్ణువుకు ప్రీతికరంగా ఈరోజు మనం అపర ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తే ఆరోగ్యం, మానసిక ఆనందం చేకూరుతాయి.
- రామకిష్టయ్య సంగనభట్ల
9440595494