నీట మునిగి బాలుడు మృతి..
వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన బొల్లె భీమేష్ కస్తూరి దంపతుల కుమారుడు బొల్లె జశ్వంత్(13) సంవత్సరాలు అనే బాలుడు పేరూరు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లి పరీక్ష రాశాడు. మధ్యాహ్నం పేరూరు సమీపంలోని భోగిరాల మడుగు అనే వాగులో స్నానం కోసం ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్లాడు.

స్నానం చేస్తున్న సమయంలో వాగులో గల్లంతై నీట మునిగాడు. సమాచారం తెలుసుకున్నతల్లిదండ్రులు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం ఆచూకీ లభ్యమైంది. సంఘటన స్థలానికి పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్ వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. వాగులో గల్లంతై మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు.

