హైదరాబాద్ : తెలంగాణలో హిందూవులు సేఫ్గా ఉండాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే ఇక్కడ పెత్తనం కొనసాగిస్తున్న పాత సామానంతా బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కీలక కామెంట్స్ చేశారు. కేంద్ర అధికారులు దీనిపైన ఆలోచన చేయాలన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.
తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆ సీఎంతోని బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది నా పార్టీ నా అయ్యా పార్టీ అనేవోలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు.. వాళ్లను రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు తెలంగాణలో వస్తయి.. ఇది నేను కాదు ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ అధికారులు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
రేవంత్ తొమ్మిదో నిజాం …
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్ కు ఏమైందో రేవంత్ రెడ్డికి అదే అవుతుందని హెచ్చరించారు.. హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో మీరు చెబుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్న ఆయన . సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. హోలీ మధ్యాహ్నం 12గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకని రాజాసింగ్ ప్రశ్నించారు.
రంజాన్ సందర్భంగా రాత్రి నుంచి ఉదయం వరకు ఎంత న్యూ సెన్స్ అవుతుందో కనిపించడం లేదా.. సౌండ్ పొల్యూషన్ అని మాపై కేసులు పెట్టారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో కూర్చొంటున్నాం.. సౌండ్ పొల్యూషన్ పైన ఒక్క మజీద్ అధికారిపైనా కేసులు పెట్టారా అని అడిగారు. హోలీ పండుగ ఉంది.. ముస్లింలు ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలని చెబితే బాగుంటుంది.. తెలంగాణ హిందువులారా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ల్లో మన పండుగలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో చూడండి అని రాజాసింగ్ పేర్కొన్నారు.