సీని ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలి…
ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలి
టికెట్ ధరల పెంపు దరఖాస్తు ఫిల్మ్ చాంబర్ ద్వారా మాత్రమే రావాలి
వ్యక్తిగత దరఖాస్తులకు ఇకపై అంగీకారం ఉండదు
టికెట్ ధరలకు కంటే లోపల తినుబండారాల ధరలే ఎక్కువ
వాటిని నియంత్రిస్తే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది..
మల్లీ ఫ్లెక్స్, సింగిల్ ధియేటర్ల గుత్తాధిపత్యం సహించబోం
ఏదైనా ప్రభుత్వ పరంగా ఫిల్మ్ సంఘాల ద్వారానే సమస్యల పరిష్కారం
తేల్చి చెప్పిన ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్
మంగళగిరి – రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కోరారు.. ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని అన్నారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి కందుల దుర్గేష్ నేడు వివరాలు అందజేశారు. ఈ క్రమంలో సినిమా థియేటర్లు, సినీపరిశ్రమలో సమస్యలపై పవన్ మీడియా ప్రకటన విడుదల చేశారు.
ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే..?
టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఇంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు.
సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై…
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం… తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు.
ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు… బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు కూడా టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని వెల్లడించారు. ఇందులో తనమన బేధాలు పాటించవద్దని తెలిపారు. ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే.. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు భారీగా ఉన్నాయన్నారు. వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటి అనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వెల్లడించారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని… ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.