పశు సంవర్థనలో ఎంట్రపెన్యూమర్స్ రావాలి
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి
రైతులకు ఉపయోగపడే వాట్సాప్ టెక్నాలజీ రావాలి
మారిటైం ప్రాజెక్టులపైనా దృష్టిపెడుతున్నాం
విజయవాడలో ఏఐ కాంక్లేవ్.. ప్రసంగించిన సీఎం
సంపద ఉన్నవారు సమాజానికి కొంతైనా పంచాలి
ఆర్థిక చేయూతనివ్వాలని చంద్రబాబు పిలుపు
వెలగపూడి, ఆంధ్రప్రభ:
ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ.. టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని చెప్పారు. గతంలో ఎంట్రపెన్యూర్లను ప్రోత్సహించుకోవడానికి జీఎఫ్ఎస్టి లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. లైవ్ స్టాక్పై 42 లక్షలు మంది ఆధారపడ్డారని, 13.5 శాతం జీఎస్టీ కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు. “నేను నిత్య విద్యార్ధిని. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను.” అని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్స్ తయారు చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాం అన్నారు. రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించారు.
మారిటైం ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం ..
ఏపీలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్తో కలిపి అభివృద్ధి చేసేందుకు విభజన హామీలో భాగంగా కేంద్రం అంగీకరించిందని, అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధిని ప్రస్తావిస్తూ, గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించామని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు.
సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి.
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసే విధానాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.. ప్రతి ఒక్కరూ సాంకేతికతలో సమర్థత పెంచుకోవాలని సూచించారు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారు.. అందులో తెలుగువాళ్లే అధికమని గుర్తు చేశారు.. మనం బాగుంటేనే చాలదని.. మనతో పాటు సమాజం కూడా బాగుండాలని, అందుకు సంపాదనలో కొంతైన తిరిగి సమాజానికి ఇవ్వాలని పిలుపునిచ్చారు.