AP Assembly | ‘ఆడుదాం ఆంధ్రా’ .. వైసిపి ప్రభుత్వంలో రూ.కోట్లు స్వాహా

అవ‌క‌త‌వ‌క‌ల‌పై నిగ్గు తేలుస్తాం
గ‌త ప్ర‌భుత్వ హయాంలో నిధులు దుర్వినియోగం
క్రీడ‌ల కోసం ఏకంగా రూ.120 కోట్లు కేటాయింపు
క్రీడాకారుల‌కు అంద‌ని పారితోషికాలు
వైసీపీ కార్య‌క‌ర్త‌ల కోస‌మే ఈ పోటీలు
వాలీబాల్ అంటే తెలియ‌ని రోజా పోటీలు నిర్వ‌హించ‌డం విడ్డూరం
దీనిపై హౌజ్ క‌మిటీ వేశాం.. నివేదిక రాగానే చ‌ర్య‌లు
అసెంబ్లీలో వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై అసెంబ్లీలో కీలక చర్చ

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రా అంటూ ఆ పార్టీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆట వస్తువులు, బ్రాండ్ అంబాసిడర్ల కోసం రూ.120 కోట్లు కేటాయించామని చెప్పి నిధులను మింగేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంపై చాలా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరికరాలు, ఆట వస్తువులు ఏమైపోయాయో తెలియడం లేదని చెప్పారు. ఆడుదాం ఆంధ్రాపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరారు. వీటికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి సమాధానమిచ్చారు. దీనిపై నిగ్గుతేల్చి సభాసంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మండిపల్లి తెలిపారు. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.

అమరావతి, ఆంధ్రప్రభ : ‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం నిర్వ‌హించిన క్రీడా పోటీల‌లో భారీ స్కాం జ‌రిగింద‌ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్ల‌డించారు. దీనిపై విచార‌ణ‌కు విజిలెన్స్ కమిటీకి, హౌస్ కమిటీకి ఆదేశాలిచ్చామ‌న్నారు. నివేదిక రాగానే దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు మంత్రి.. కాగా అసెంబ్లీలో నేడు ప్ర‌శ్నోత్త‌రాల సమయంలో ప‌లువురు టీడీపీ స‌భ్యులు ఈ అంశాన్ని లేవ‌నెత్తారు.

‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో విప‌క్షాల‌తోనే ఆట : అఖిల ప్రియ


ముందుగా మాజీ మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ… ‘ఆడుదాం ఆంధ్ర‌’ అనే పేరుతో గత జగన్ ప్రభుత్వం ఆంధ్రాతోనే ఆడుకుందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని కాపాడుతుందని చెప్పారు. ఫుట్‌బాల్‌కు, వాలీబాల్‌కు తేడా తెలియని అప్పటి మంత్రి ఆర్కే రోజా రూ.120 కోట్లతో గేమ్స్ నిర్వహించారని విమర్శించారు. క్రీడాకారుల గుర్తింపు ఎక్కడా జరగలేదని చెప్పారు. మిగతా స్కాంలకు ఈ స్కాంకు చాలా తేడా ఉందన్నారు. మిగతా స్కాంల మాదిరి కాకుండా కళ్ల ముందు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇందులో అవినీతి జరిగిందని ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్ర‌’ నిధులను మిస్ యూజ్ చేశారని మండిపడ్డారు. వలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్టర్ చేశారని మాజీ మంత్రి అఖిల ప్రియ అన్నారు.

క్రీడాకారులకు డబ్బులు ఇవ్వలేదు
పబ్లిసిటీకి రూ.35 కోట్లు స్టిక్కర్‌లకు, సోషల్ మీడియాకు, హోర్డింగ్‌లకు ఖర్చు చేశారని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. గెలిచిన క్రీడాకారులకు రూ.12 కోట్లు అకౌంట్లలో వైసీపీ ప్రభుత్వం వేయలేదని గుర్తుచేశారు. విశాఖపట్నంలో క్లోజింగ్ సెర్మనీ పెట్టి ముందు రూ. 2 కోట్లు అని ఆ తర్వాత.. మరో రూ.3 కోట్లు శాంక్షన్ చేసి ప్రైవేటు సెక్యూరిటీని పెట్టారన్నారు. విలేజ్ సచివాలయాల్లో 15000 సచివాలయాలు పార్టిసిపేట్ చేస్తే 35 లక్షల మంది చూడటానికి వచ్చారని చెప్పారు. విశాఖపట్నంలో 35 వేల మంది ఆడియన్స్‌తో కార్యక్రమం చేస్తే అప్పటి సీఎం జగన్ రాలేదని చెప్పారు. విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసిన వారు ఎంత మంది అని ప్రశ్నించారు. ఆ వివరాలపై సంబంధిత అధికారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అడిగితే.. వాటిని డిలీట్ చేశారని అధికారులు చెప్పారని అన్నారు. రూ.400 కోట్లు దీనిలో స్కాం జరిగిందని తెలిపారు. దీనికోసం జిల్లాల నిధులను కూడా ఈ కార్యక్రమానికి వాడారని తెలుస్తోందని అఖిల ప్రియ అన్నారు.

క్రీడాకారుల‌కు అవమానం : ఎమ్మెల్యే గౌతు శిరీష


పలాస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అనే కార్యక్రమం పెట్టి క్రీడలను అపహాస్యం చేశారన్నారు. ఎన్నికల ముందు యువతను ప్రలోభ పెట్టేందుకు ఈ కార్యక్రమం తెచ్చారని ఆరోపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో విజేతలను ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేకపోయారని మండిపడ్డారు. నాణ్యత లేని కిట్లు, క్రీడా పరికరాలు, రవాణా చార్జీలు, భోజన వసతి పేరుతో కోట్లకు పైగా కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్రా ’ ముగింపు కార్యక్రమాలకు వీఐపీలపేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. సీఐడీ విచారణ ఒక్కరోజు మాత్రమే జరిగిందని తెలిపారు. అధికార పక్షం అవినీతిపై ప్రజల ముందు పెట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్ చేశారు.

యువత జీవితాలతో ఆట‌లు : ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు


తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ,. రాష్ట్ర యువత జీవితాలతో ‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిలు ఆడుకున్నారని విమర్శించారు. వైసీపీ అగ్రనేతల ఆధ్వర్యంలో అవినీతికి బరితెగించారని చెప్పారు. దీనివెనుక తాడేపల్లి ప్యాలెస్ ఉందని విమర్శలు చేశారు. 120 మంది బ్రాండ్ అంబాసిడర్‌లు ఈ క్రీడలకు నియమించారని తెలిపారు. వారు ఎవరు, వారి అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికోట్లు పెట్టి ‘ఆడుదాం ఆంధ్ర‌’ కోసం క్రీడాకారులకు కావాల్సిన మెటీరియల్స్ కొన్నారు. అవి ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందితో ఈ ఆటలు ఆడించారని విమర్శించారు. సరిగ్గా ఎన్నికల ముందు యువతను ప్రలోభ పెట్టే కార్యక్రమం చేశారని మండిపడ్డారు. ‘ఆడుదాం ఆంధ్ర‌’ కోసం ఎన్ని టీంలు వచ్చాయి, ఎంత మంది ఆడారు, పారితోషికం ఎంతో చెప్పాలని నిలదీశారు. ప్రజా సొమ్మును కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డిమాండ్ చేశారు

విచార‌ణ జ‌రుగుతుంది : మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి


దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇస్తూ,. గత జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ. 119.19కోట్లు కేటాయించిందని.. దానిలో ఖర్చు చేసింది రూ. 119.11 కోట్లు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 47 రోజుల్లో పూర్తిచేశారని చెప్పారు. ఈ మొత్తం నిధులను ఆర్ అండ్ బీ, స్పోర్ట్ శాఖ, జిల్లా కలెక్టర్‌ల ద్వారా ఖర్చు చేశారని గుర్తుచేశారు. స్పోర్ట్స్ కిట్‌ల కోసం రూ.38.55 కోట్లు, టీషర్ట్‌‌లు, క్యాప్‌ల కోసం రూ. 34.2 కోట్లు, జిల్లా కలెక్టర్‌లు, స్పోర్ట్స్ అకౌంట్స్‌కు రూ.40.93 కోట్లు డిపాజిట్ చేశారని .. దానిలో రూ.21 కోట్లు ఆఫ్ సైటింగ్ చార్జీల కోసం ఖర్చు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అయితే ఈ ఖ‌ర్చుల‌న్నీ కూడా ఫేక్ అని, వాటిపై విచార‌ణ చేస్తున్నామ‌ని తెలిపారు

భారీ స్థాయిలో అవినీతి
ప్రైజ్ మనీ కోసం రూ.12.21 కోట్లు 41 రోజుల్లోనే ఖర్చు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడాశాఖ మంత్రిగా చెబుతున్నా పేద క్రీడాకారుల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుందని విమర్శించారు. ఈ విషయంపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని అన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర‌’లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. 45రోజుల్లోనే విజిలెన్స్ కమిటీకి, హౌస్ కమిటీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయట పెడుతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కల్పించుకుని మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్ర‌’పై కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *