(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఎంతో చరిత్ర ఉన్న విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలకు అటానమస్ హోదా తిరిగి పునరుద్ధరణ అయింది. గతంలో ఉన్న అటానమస్ హోదా 2022-23 సంవత్సరంతో ముగిసినప్పటికీ, తదుపరి రెన్యువల్ కోసం కళాశాల యాజమాన్యం యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ను సంప్రదించలేదు. అయినప్పటికీ ఆంధ్రా లయోల కళాశాల మాత్రం లేని అటానమ హోదాతోనే కొనసాగుతూ వస్తుంది. ఇటీవల దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో కృష్ణ యూనివర్సిటీ స్పందించి, కళాశాలకు నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో కళాశాల యాజమాన్యం తిరిగి అటానమస్ హోదా కోసం యూజీసీకి అన్ని అనుమతులు కోరుతూ పూర్తి సమాచారంతో దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవలే సమావేశమైన యూజీసీ కమిటీ సభ్యులు కళాశాల దరఖాస్తులు, విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు, వాస్తవ పరిస్థితులపై క్షుణ్ణంగా విచారణ చేసి తిరిగి కళాశాలకు అటానమస్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3031- 32 విద్యా సంవత్సరం వరకు సుమారు పది సంవత్సరాల పాటు ఈ అటానమస్ హోదా కళాశాలకు లభిస్తోంది. దీనికి సంబంధించి యూజీసీ పూర్తి ఆదేశాలను క్రిష్ణ యూనివర్సిటీకి జారీ చేసింది. ప్రస్తుతం 10 సంవత్సరాల కాల పరిమితికి జారీ చేస్తున్న ఈ ఆదేశాలు ముగిసే మూడు నెలల ముందుగానే రెన్యూవల్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కృష్ణ యూనివర్సిటీ రిజిస్టార్ కు జారీ చేసిన ఆదేశాలలో యూజీసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం కళాశాలకు తిరిగి అటానమస్ హోదా లభించడం పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
