Medical | అపూర్వ సమ్మేళనం

Medical | అపూర్వ సమ్మేళనం
సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆనందోత్పాహం
కాలేజీకి బస్సు బహూకరణ
జీజీహెచ్ అభివృద్ధిపై ఎంపీ ఫోకస్
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో )
విజయవాడ జనరల్ ఆసుపత్రి కి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు లతో కలిసి అభివృద్ది చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ లో శుక్రవారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, ఎపి డి.ఎమ్.ఈ డాక్టర్ జి.రఘునందం అతిథులుగా పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీకి బస్సు బహుమతి
విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధులు డాక్టర్ యలమంచిలి హైమవతి, డాక్టర్ రాజారావు బహుకరించిన బస్సును ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Sivanath) ప్రారంభించారు. అనంతరం బస్సు ను పరిశీలించారు. అంతకంటే ముందు బస్సు కీ ను కాలేజీ అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ , ప్రభుత్వాసుపత్రి అభివృద్ది కోసం ప్రతి నెల ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ లతో కలిసి పరిశీలన చేయాలని ప్రణాళిక చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి రోజు మూడు నుంచి 4 వేల మంది ఓపి వున్న విజయవాడ జీజీహెచ్ కి తగిన గుర్తింపు రాలేదని, ఆ గుర్తింపు తీసుకువచ్చేందుకు వైద్య రంగంలో అనుభవం వున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సలహాలు, సూచనలతో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరావు లతో కలిసి గుంటూరు ప్రభుత్వాసుపత్రిని మించేలా విజయవాడ ప్రభుత్వాసుపత్రిని అభివృద్ది చేస్తామన్నారు.
విజయవాడ జీజీహెచ్ కు లినాక్ అత్యవసరం
ఇక విజయవాడ జీజీహెచ్ లోని రెడియాలజీ విభాగంలో క్యాన్సర్ చికిత్సకు ‘లినాక్ పరికరం తెప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వెద్య సేవల్లో ముఖ్యమైన లినాక్ పరికరాన్ని విజయవాడ (Vijayawada) జీజీహెచ్ లో అందుబాటులోనికి తీసుకురావాల్సిన అవసరంపై కలెక్టర్ కార్యాయలంలో జీజీహెచ్ అభివృద్ది పై జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న సత్యకుమార్ కుమార్ యాదవ్ తో చర్చించినట్లు తెలిపారు. విజయవాడ జీజీహెచ్ లో లినాక్ పరికారం అందుబాటులోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించినట్లు తెలిపారు. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి, ఉన్నత వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపినట్లు వివరించారు. అదే విధంగా మెడికల్ కాలేజీలోని పి.జి హాస్టల్ బిల్డింగ్స్, నర్సింగ్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి అవసరమైన రూ.80 కోట్ల నిధుల కోసం కృషి చేస్తున్నట్లు, త్వరలోనే ఆ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
