కాలిఫోర్నియా – అమెరికాలో లక్షలాది మంది వలసదారుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన 5 లక్షల మందికి పైగా వలసదారులకు మానవతా దృక్పథంతో కల్పించిన పరోల్ (తాత్కాలిక వలస) రక్షణలను రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ తీర్పుతో పాటు, మరో కేసులో సుమారు 3,50,000 మంది వెనిజులా వలసదారులకు కల్పించిన తాత్కాలిక చట్టబద్ధ హోదాను కూడా రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఈ పరిణామాలతో దాదాపు పది లక్షల మంది వలసదారులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందని స్థానిక మీడియా శుక్రవారం నివేదించింది.
అమెరికా-మెక్సికో సరిహద్దులకు వస్తున్న వలసదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బైడెన్ ప్రభుత్వం 2022 చివరలో ఈ మానవతా పరోల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద వలసదారులకు రెండేళ్లపాటు అమెరికాలో పనిచేసుకునేందుకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 5,32,000 మందికి బహిష్కరణ నుంచి రక్షణ లభించింది.
అయితే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, అన్ని పరోల్ కార్యక్రమాలను రద్దు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ను ఆదేశిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వు మేరకు క్రిస్టీ నోయెమ్ మార్చి నెలలో పరోల్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 24 నాటికి అమల్లో ఉన్న పరోల్ అనుమతుల గడువు ముగుస్తుందని తెలిపారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 23 మంది వ్యక్తులు, పలువురు పరోల్ పొందినవారు, ఒక స్వచ్ఛంద సంస్థ మసాచుసెట్స్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. దీంతో వలసదారుల తాత్కాలిక హోదా రద్దును నిలిపివేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ట్రంప్ ప్రభుత్వం మొదట ఫస్ట్ సర్క్యూట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లో దీనిని సవాలు చేసినా ఫలితం లేకపోవడంతో, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, దిగువ కోర్టు ఉత్తర్వులను ఎత్తివేసింది.