న్యూ ఢిల్లీ – ఖతార్ (quatar) లోని అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదెయిద్పై ఇరాన్ (Iran ) క్షిపణి దాడుల నేపథ్యంలో నిలిపివేసిన విమాన సర్వీసులను (Flight services ) ఎయిరిండియా నేటి నుంచి పునరుద్ధరించింది. మధ్యప్రాచ్యం, యూరప్ లోని పలు ప్రాంతాలకు ఎయిరిండియా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఈ మేరకు ఎయిరిండియా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. “మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో గగనతలాలు క్రమంగా తెరుచుకుంటున్నందున, ఎయిరిండియా ఈ రోజు నుంచి దశలవారీగా ఆయా ప్రాంతాలకు విమాన సర్వీసులను పునఃప్రారంభింది. 25 నుంచి మధ్యప్రాచ్యానికి చాలా వరకు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి. గతంలో రద్దు చేయబడిన యూరప్ విమాన సర్వీసులు కూడా నేటి నుంచి క్రమంగా పునరుద్ధరించారు. . అమెరికా తూర్పు తీరం, కెనడాకు సర్వీసులు వీలైనంత త్వరగా పునఃప్రారంభించబడతాయి” అని ఆయన తెలిపారు.
కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దు కావచ్చని, ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని, సురక్షితం కాని అన్ని గగనతలాలను నివారిస్తామని ఎయిర్ లైన్ పేర్కొంది.
“కొన్ని విమానాలు పొడిగించిన రూటింగ్ మార్పులు లేదా ప్రయాణ సమయాల కారణంగా ఆలస్యం లేదా రద్దు కావచ్చు. అయితే, అంతరాయాలను తగ్గించడానికి ,మా షెడ్యూల్ సమగ్రతను పునరుద్ధరించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎయిరిండియా ఎప్పటికప్పుడు సురక్షితం కాదని అంచనా వేయబడిన గగనతలాలను తప్పించడం కొనసాగిస్తుంది. ప్రయాణికులకు ఏవైనా అప్డేట్లు ఉంటే తెలియజేస్తాం. వారి సహనానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రయాణికులు, సిబ్బంది , విమానాల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత” అని ఎయిరిండియా ప్రతినిధి వివరించారు.