పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం..

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం..
యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అంచనాలు సిద్ధం చేయాలి..
జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అడ్లూరి..
గొల్లపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు యుద్ధ ప్రాతిపాదికన అంచనాలు తయారు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజు పల్లి గ్రామంలో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి లక్ష్మణ్ కుమార్ వ్యవసాయ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆకాల వర్షాలకు జగిత్యాల జిల్లాలో 6160 ఎకరాల్లో మామిడి పంట, 1029 ఎకరాల్లో వరి, 1520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వు పంటలు దెబ్బ తిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి తెలిపారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.
పెట్టుబడులు పూర్తయి పంట చేతికి వచ్చే సమయంలో ఇలా నష్టపోవడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు. అధికారులు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వచ్చే విధంగా అంచనాలు రూపొందించి నివేదికను పంపించాలని మంత్రి ఆదేశించారు.
